దేశ రాజధాని దిల్లీ వాసులకు అక్కడి కాలుష్య నియంత్రణ కమిటీ ఝలక్ ఇచ్చింది. ఇకపై వేడుకలు, సమావేశాలు వంటి కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘించి శబ్దకాలుష్యానికి పాల్పడితే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శబ్దకాలుష్యానికి విధించే పెనాల్టీ మొత్తాల్ని సవరించింది.
నూతన నిబంధనల ప్రకారం.. పండగ సమయాల్లో నివాస, వాణిజ్య సముదాయాల్లో నిర్ణీత గడువు తర్వాత కూడా టపాసులు పేల్చేవారికి రూ.1000 జరిమానా విధించనున్నారు. అదే సైలెంట్ జోన్లలో ఈ జరిమానా రూ.3000గా ఉంది. ఇక నివాస సముదాయాల్లో పెళ్లి వేడుకలు, పబ్లిక్ ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాల్లో బాణసంచా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10,000 చెల్లించాలి. సైలెంట్ జోన్లలో ఈ జరిమానా రూ.20వేలుగా ఉంది. ఈ ప్రాంతాల్లో రెండోసారి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.40వేలు, అంతకంటే ఎక్కువసార్లు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని అధికారులు వెల్లడించారు. అంతేగాక, ఆ ప్రాంతాన్ని సీల్ చేస్తామని కూడా హెచ్చరించారు.
ఇక జనరేటర్ సెట్ల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ కఠిన చర్యలు చేపట్టింది. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటివి ఉపయోగిస్తే రూ.10వేల జరిమానా విధిస్తామని తెలిపింది. 62.5 నుంచి 1000కేవీఏ జనరేటర్ సెట్లను ఉపయోగిస్తే రూ.25వేలు, 1000కేవీఏ కంటే ఎక్కువ సామర్థ్యం గల జనరేటర్ సెట్లను వినియోగిస్తే రూ.లక్ష చెల్లించాలని స్పష్టం చేసింది. భారీ శబ్దాలు వచ్చే నిర్మాణ పరికరాలు ఉపయోగిస్తే రూ.50వేల జరిమానా ఉంటుందని తెలిపింది.
ఇదీ చూడండి: '2024 నాటికి 60వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం'