వ్యవసాయం, కార్మిక రంగాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సంస్కరణలు ఎట్టకేలకు కార్యరూపం దాల్చాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెల్లడించారు. అయితే సంస్కరణలపై తొలుత భేదాభిప్రాయాలు తలెత్తినా.. రైతుల సంక్షేమం కోసమే సాగు చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదని స్పష్టం చేశారు.
72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు కోవింద్. కొన్ని సందర్భాల్లో తలెత్తే ప్రతికూలతలు గొప్ప పాఠాలు నేర్పిస్తాయని.. అవే మనల్ని మరింత శక్తివంతంగా తీర్చుదిద్దుతాయని అభిప్రాయపడ్డారు. వీటితో విశ్వాసం పెరుగుతుందన్నారు.
"ఈ విశ్వాసంతో అనేక రంగాల్లో భారత్ ముందడుగు వేసింది. ఎన్నో ఏళ్లుగా చేపట్టాల్సిన సంస్కరణలు ఇప్పుడు చట్టాల రూపంలో వచ్చాయి. ఆర్థిక సంస్కరణలకు ఇవి ఊతమందిస్తాయి. అయితే తొలినాళ్లల్లో ఈ సంస్కరణలపై భేదాభిప్రాయాలు ఉన్నా.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు."
--- రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి.
ఈ నేపథ్యంలో రైతులు, శాస్త్రవేత్తలు, సైనికులపై కోవింద్ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా సంక్షోభంలోనూ రైతులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చారని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా చూసుకున్నారని ప్రశంసించారు.
అతి తక్కువ కాలంలో కొవిడ్-19కు టీకా తీసుకొచ్చి మానవాళికి శాస్త్రవేత్తలు సహాయం చేశారని పేర్కొన్నారు కోవింద్. వారి సేవలను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. ఇతర దేశాల కన్నా భారత్లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటాని శాస్త్రవేత్తలు, వైద్యులే కారణమన్నారు.
మరోవైపు సియాచిన్, గల్వాన్ లోయలో నిరంతరం సైనికులు దేశ సరిహద్దును పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలిలోనూ విధులు నిర్వర్తిస్తుండటంపై గొప్ప విషయమన్నారు.
ఇదీ చూడండి:- 'ఓటు హక్కును ప్రతి ఒక్కరు గౌరవించాలి'