ఒడిశా రాజధాని భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించింది. కరోనా టీకా పంపిణీలో 100శాతం లక్ష్యాన్ని చేరుకుంది. నగరంలో 18ఏళ్లు పైబడిన, అర్హులైన అందరికీ వ్యాక్సిన్ రెండో డోసులను అందించినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నగరం ఇదేనని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అన్షుమన్ రథ్ తెలిపారు.
భువనేశ్వర్లో 18ఏళ్ల వయసు పైబడిన వారు దాదాపు 9లక్షల మంది ఉండగా.. ఇప్పటివరకు 18.16లక్షల మందికి టీకా డోసులు అందించినట్లు అన్షుమన్ చెప్పారు. నగరంలో అర్హులైన 100శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. వారితో పాటు కొంతమంది వలస కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా ఇక్కడ టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. నగరంలో 31వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, 33వేల మంది ఫ్రంట్లైన్ వర్కర్లు, 5.17లక్షల మంది 18 - 44 ఏళ్ల మధ్య వయస్కులు, 45ఏళ్లు పైబడిన 3.25లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించినట్లు పేర్కొన్నారు.
టీకా పంపిణీలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్షుమన్ వివరించారు. నగర వ్యాప్తంగా 55 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సహకారంతో లక్ష్యాన్ని వేగవంతంగా పూర్తిచేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: