ఒడిశాలోని ఓ మఠంలో సుమారు 45వెండి ఇటుకలు బయటపడ్డాయి. ఎండోమెంట్ విభాగం.. మఠం నిర్వహణ బాధ్యతలు, ఆస్తులను వేరొక ట్రస్ట్కు అప్పగించే క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కో ఇటుక బరువు సుమారు 30కిలోలకుపైగా ఉంటుందని అధికారులు చెప్పారు.


పూరీ జిల్లాలోని ప్రసిద్ధ ఎమర్ మఠ్ నిర్వహణ బాధ్యతలను.. ఎండోమెంట్ కమిషనర్.. కొత్త ట్రస్ట్కు మార్చారు. ఈ క్రమంలో ఆ మఠానికి చెందిన ఆస్తులను ట్రస్ట్కు అప్పగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మఠంలోని ఓ గదిలో ఉంచిన నాలుగు పెట్టెల్లోని వెండి ఇటుకలు బయటపడ్డాయి. ఒక్కో ఇటుక సమారు 30కిలోల కంటే అధిక బరువుంటుందని చెప్పిన అధికారులు.. తూనికలు, కొలతల ప్రక్రియ పూర్తయ్యాక కొత్త ట్రస్ట్కు అప్పగిస్తామన్నారు.

నాడు 522 వెండి ఇటుకలు..
2010లో ఎండోమెంట్ విభాగం.. ఈ మఠానికి సంబంధించిన ఆస్తులను లెక్కించి.. ఆ జాబితాలో 45వెండి ఇటుకలను చేర్చింది. 2011లో అక్కడ సోదాలు నిర్వహించగా.. లెక్కల్లోలేని 522వెండి ఇటుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే.. మఠానికి సరైన భద్రత లేని కారణంగా.. వాటిని నేలలో పూడ్చారని.. మఠానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఎండోమెంట్ విభాగం చొరవతో వాటిని తిరిగి అప్పగించామన్నారు.
ఇదీ చదవండి: మురికివాడలో భారీ అగ్నిప్రమాదం- గుడిసెలు దగ్ధం