సహజీవనంపై పంజాబ్, హరియాణా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించాలని అమ్మాయి, అబ్బాయి నిర్ణయించుకుంటే కోర్టు ఆపలేదని పేర్కొంది. తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరిన 17ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయి విజ్ఞప్తికి అంగీకారం తెలిపింది. ఈ జంటకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేకించి పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. అలా జరగకుండా ప్రేమ జంటలకు రక్షణ కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.
పంజాబ్ బఠిండాకు చెందిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది. తన ప్రేమ విషయం తెలిసి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారని యువతి పిటిషన్లో పేర్కొంది.
ఈ జంట ప్రస్తుతం కుటుంబాలకు దూరంగా ఉంటోంది. ఇద్దరికి పెళ్లి వయసు రావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. అప్పటివరకు కలిసి ఉండి ఆ తర్వాత వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించగా వారి నుంచి స్పందన లేక పోవడం వల్ల కోర్టును ఆశ్రయించింది.
భారత్లో అమ్మాయిల కనీస వివాహ వయస్సు 18 ఏళ్లు కాగా, అబ్బాయిలకు 21 ఏళ్లు.