New Toll System In India : జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులువుగా మార్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. టోల్గేట్ల వద్ద ప్రయాణికులు అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. కొత్త విధానానికి భారత ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విధానం ఏంటంటే..
హైవేలపై టోల్ప్లాజాల వద్ద బ్యారియర్లు లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే.. ప్రయాణికులు టోల్ గేట్ దగ్గర కనీసం అర నిమిషం అయినా ఆగాల్సిన పని లేకుండా హైవేపై దూసుకుపోవచ్చు. ఈ విషయాన్ని జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. టోల్ విధానంలో మరికొన్ని మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. "రహదారులపై ప్రయాణించిన దూరానికే ఛార్జీలు వసూల్ చేసే విధానం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ విధానంపై ట్రయల్స్ జరుపుతున్నాము. ఈ ట్రయల్స్ విజయవంతమైతే.. త్వరలోనే కొత్త విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టనున్నాము. ఈ ప్రయత్నం ద్వారా పౌరులకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది" అని ఆయన అన్నారు.
Tollgate Fastag : ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ట్యాగ్ విధానం.. టోల్ప్లాజాల వద్ద ప్రయాణికుల వెయిటింగ్ సమయాన్ని 47 సెకన్లకు తగ్గించింది. అయితే రానున్న రోజుల్లో ఈ వెయిటింగ్ సమయాన్ని 30 సెకన్ల కన్నా తక్కువ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి వీకే సింగ్ తెలిపారు.
కొత్త టోల్ వ్యవస్థ వల్ల కిలోమీటర్ ఆధారంగా చెల్లింపులు చేయొచ్చని మంత్రి వీకే సింగ్ తెలిపారు. "ప్రస్తుతం ఈ విధానాన్ని దిల్లీ - మేరఠ్ ఎక్స్ప్రెస్వేలో ఆధునిక సాంకేతికత ఆధారంగా పరీక్షిస్తున్నాం. ప్రయాణికుడు జాతీయ రహదారిలోకి ప్రవేశించిన వెంటనే.. వాహనం నంబర్ ప్లేట్ను కెమెరాలు స్కాన్ చేసి, డేటాను సేకరిస్తాయి. ఆ విధంగా ప్రయాణించిన దూరానికే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే టోల్ నిబంధనల ప్రకారమే ఈ ఛార్జీలు ఉంటాయి" అని వీకే సింగ్ అన్నారు.