దేశంలో కరోనా మృత్యువిలయం కొనసాగుతోంది. ప్రస్తుత తరుణంలో చెన్నై వాసి సీతాదేవి, కేరళకు చెందిన ప్రేమ చంద్రన్ తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కొవిడ్ రోగులకు ప్రయాణ సమస్య లేకుండా ఆటోల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు.
తనలా కాకూడదని..
యూరిన్ ఇన్ఫెక్షన్కు గురైన తన తల్లిని మే 1 రాత్రి 12 గంటలకు ఆసుపత్రికి తీసుకెళ్లింది సీతాదేవి. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పడక లభించక ఆస్పత్రి బయటే వేచి ఉన్నారు. చివరి క్షణాల్లో బెడ్ లభించి.. ఆక్సిజన్ అందించినా ప్రయోజనం లేకపోయింది. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసిన సీతాదేవి.. తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకుంది. తనకున్న ఆటోకు ఆక్సిజన్ సిలిండర్లు తగిలించి కొవిడ్ రోగులకు ఉచితంగానే అత్యవసర సేవలు అందిస్తోంది.

ఉదయం 8నుంచి రాత్రి 8 వరకు రోగులను ఆస్పత్రులకు చేరవేసే పనిలోనే ఉంటానని చెబుతోంది సీతాదేవి. వ్యాధిగ్రస్థుల ఆరోగ్య స్థితిగతులను బట్టి.. అవసరమైతే ఆక్సిజన్ని అందిస్తామని పేర్కొంది. దాదాపు ప్రతి రోజు 3,000 కాల్స్ వస్తున్నాయని పేర్కొంది.
స్ట్రీట్ విజన్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న ఆమె.. పేదవారికి ఆహారం తదితర నిత్యావసర సేవలను అందిస్తోంది.
500 ట్రిప్పులు..
కేరళకు చెందిన ప్రేమ చంద్రన్.. 30 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాడు. కరోనా సోకిన వారిని ఆటోలో ఎక్కించుకోవడానికి అందరూ భయపడుతున్న సమయంలోనే.. వైరస్ బారిన పడిన గర్భిణీని ఆస్పత్రికి చేర్చాడు. ఇప్పటివరకు 500 మంది కొవిడ్ రోగులను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నాడు.
వ్యాధి బారిన పడిన వారిని ఆస్పత్రికి చేర్చాలని ఆశా వర్కర్లు తనకు ఫోన్ చేస్తుంటారని ప్రేమ్ అంటున్నాడు. కుటుంబ సభ్యులు కూడా తనను ప్రోత్సహిస్తున్నారని చెప్పాడు.

ఇదీ చదవండి: షూ లేకుండా బైక్ నడిపితే ఫైన్- మీకు తెలుసా?