పాము కాటు వేస్తే ఎవరైనా దాన్ని కొట్టి చంపేస్తారు. లేదంటే అక్కడ నుంచి దూరంగా పారిపోతారు. వెంటనే ఆస్పత్రికి వెళ్తారు. అయితే ఒడిశా బాలాసోర్లోని గాంగ్పురకు చెందిన ఓ వ్యక్తి మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. తనను కరిచిన పామును పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ పామును చూస్తే వైద్యుడు సరిగ్గా తనకు చికిత్స చేయగలడని చెప్పాడు.
![snake bite farmer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17309995_pp.jpg)
ఇదీ జరిగింది..
భగవత్ ప్రధాన్ అనే రైతు తన పొలంలో కూరగాయలు కోయడానికి వెళ్లాడు. అప్పుడు అతడికి పాము కాటు వేసింది. వెంటనే భగవత్ తన బంధువును కర్ర పట్టుకుని రమ్మన్నాడు. ఇద్దరు కలిసి పాముని కర్రతో ఒడిసి పట్టుకున్నారు. తర్వాత పాలిథీన్ కవర్లో పెట్టి.. బాలాసోర్ మెడికల్ ఆస్పత్రికి చేరుకున్నారు. వీరి దగ్గర పామును చూసి ఆస్పత్రిలోని వైద్యులు, రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. వైద్యులు చికిత్స అనంతరం భగవత్ కోలుకుంటున్నాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.