Longest Train In India : వివేక్ ఎక్స్ప్రెస్.. భారతీయ రైల్వేలో అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే రైలు. అసోంలోని డిబ్రుఘడ్- తమిళనాడులోని కన్యాకుమారి మధ్య ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్య దూరం 4,152 కిలోమీటర్లు. దేశంలోనే అత్యంత దూరం ప్రయాణించే రైలుగా వివేక్ ఎక్స్ప్రెస్ రికార్డు సృష్టించింది. అసోం, బంగాల్, ఏపీ, తమిళనాడు సహా ఏడు రాష్ట్రాల్లో 75 గంటలు ప్రయాణించి ఈ రైలు గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. వివేక్ ఎక్స్ప్రెస్ మరికొన్ని ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.
Longest Train Journey In India : మొదట్లో వారానికి రెండు సార్లు మాత్రమే నడిచే వివేక్ ఎక్స్ప్రెస్.. ప్రస్తుతం ఆదివారం, మంగళవారం, గురువారం, శనివారం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులు మరింతగా వివేక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. దిబ్రుగఢ్లోని బనిపుర్ స్టేషన్లో రాత్రి 7 గంటల 25 నిమిషాలకు వివేక్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. 75 గంటల ప్రయాణించి భారతదేశ దక్షిణ కొన అయిన కన్యాకుమారికి రాత్రి ఎనిమిది గంటలకు చేరుకుంటుంది. మళ్లీ మరుసటి రోజు సాయంత్రం 5:20కి ప్రారంభమై 75 గంటల ప్రయాణం తర్వాత దిబ్రుగఢ్కు చేరుకుంటుంది. ఈ సుదూర ప్రయాణంలో 58 రైల్వే స్టేషన్లలో వివేక్ ఎక్స్ప్రెస్ ఆగుతుంది. వివేక్ ఎక్స్ప్రెస్లో 2 AC, 3AC, స్లీపర్, జనరల్ బోగీలు ఉన్నాయి. ఒక ప్యాంట్రీ కారు, లగేజ్ బోగీ కూడా ఉంది.
Vivek Express Wikipedia : కాగా.. దేశంలోనే అత్యధిక దూరం ప్రయాణించే రైలుగా వివేక్ ఎక్స్ప్రెస్ నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు ఈశాన్య సరిహద్దు రైల్వే(ఎన్ఈఎఫ్ఆర్) జోనల్ మేనేజర్ ఉత్తమ్ ప్రకాశ్. వివేక్ ఎక్స్ప్రెస్ సమర్థంగా ప్రయాణికులు సేవలు అందిస్తుందని ఆయన కొనియాడారు.
వివేక్ ఎక్స్ప్రెస్ రైలు గురించి 2011-12 రైల్వే బడ్జెట్లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు. 2013లో స్వామి వివేకానంద 150 జయంతి సందర్భంగా జనవరి 12న ఈ రైళ్లను పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. నిర్విరామంగా రాకపోకలు సాగిస్తున్న ఈ రైలు సర్వీసుకు కొవిడ్ సమయంలో బ్రేక్ పడింది. కొవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో రైల్వేశాఖ అన్ని రైళ్ల సర్వీసులను నిలిపివేసింది. అలా నిలిచిపోయిన ఆఖరి రైలు వివేక్ ఎక్స్ప్రెసే కావడం గమనార్హం.