Quran recitation in temple: కర్ణాటక హాసన్ జిల్లా బెలూర్లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో జరిగే రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఏటా ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. ఈ సారి వేడుకలు బుధవారం జరిగాయి. అయితే రథయాత్రకు ముందు ఖరాన్ చదవడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

దీనిపై స్పందించిన ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ఆలయంలో రథయాత్రకు ముందు ఖురాన్ చదవడం దశాబ్దాలుగా ఉన్న ఆచారమని, దాన్ని దృష్టిలో ఉంచుకునే రిలీజియస్ ఎండోమెంట్స్ కమిషనర్కు లేఖ రాసి అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. ఆలయ పరిపాలకుడు విక్రమాదిత్య ఈ మేరకు వివరణ ఇచ్చారు. కమిషనర్ రోహిణి సింధూరి ఇందుకు అనుమతి ఇచ్చిన్నట్లు చెప్పారు. హిందూ మత చట్టం 2002లోని సెక్షన్ 508 ప్రకారం దేవాలయాలు, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోలేమని లేఖకు ప్రతిస్పందనలో రోహిణి చెప్పినట్లు పేర్కొన్నారు. అందుకే ఎప్పటిలాగే ఈసారి కూడా రథం కదలాడానికి ముందు బుధవారం ఉదయం 10:40 గంటలకు ముస్లిం మతపెద్ద ఖాజీ సాబ్.. ఖురాన్ను పఠించినట్లు చెప్పారు.

Karnataka temple Quran: ఏటా రథోత్సవానికి ముందు ఖురాన్ చదవడం సాధారణమేనని, కానీ ఈసారి కొందరి నుంచి అభ్యంతరాలు రావడం వల్లే ప్రత్యేకంగా లేఖ రాసి అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు. ఈసారి ఆలయం వద్ద జరిగే తిరునాళ్లలో ముస్లిం కుటుంబాలు షాపులు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వొద్దని హిందూ సంస్థలకు చెందిన కొందరు కలెక్టర్, తహసీల్దార్, ఆలయ పరిపాలకులకు లేఖలు కూడా రాశారు. కానీ చివరకు 15 ముస్లిం కుటుంబాలకు తిరునాళ్లలో దుకాణాలు పెట్టుకునేందుకు అవకాశం దక్కింది.

Karnataka Belur Temple: ఈసారి రోథత్సవంలో కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ అభిమానులు హంగామా చేశారు. ఆయన ఫొటోలు, కన్నడ జెండాలు పట్టుకుని 'అప్పు.. అప్పు..' అనే నినాదాలతో ఆలయ ప్రాంగాణాన్ని హోరెత్తించారు. కర్ణాటకలో ఇప్పటికే హిజాబ్ వివాదం చెలరేగిన నేపథ్యంలో రథోత్సవంలో ఖురాన్ చదవడానికి అనుమతి ఇవ్వొద్దని హిందూ సంస్థలు అధికారులను కోరాయి. కానీ వారు సంప్రదాయానికే పెద్దపీట వేశారు.
ఇదీ చదవండి: గుజరాత్లోనూ 'బుల్డోజర్ ట్రెండ్'.. నిందితుడి ఆస్తులు ధ్వంసం