పుల్వామా తరహాలో భద్రతా దళాలపై కారు బాంబుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ముకశ్మీర్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ముష్కరులను అరెస్ట్ చేశారు. కశ్మీర్లోని పాంపోర్ జిల్లాలో భద్రతా దళాలపై కారు బాంబు దాడులకు వీరు ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించారు.
" జైషే ఉగ్రసంస్థ కారు బాంబు దాడులు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. అవంతిపొరా పోలీసులు ఈ కుట్రను ఛేదించారు. ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న నలుగురిని అరెస్ట్ చేశాం. దాడుల కోసం ఉపయోగించేందుకు సిద్ధం చేసుకుంటున్న కారును స్వాధీనం చేసుకున్నాం."
- విజయ్ కుమార్, కశ్మీర్ జోన్ ఐజీ
మొబైల్ యాప్ల ద్వారా విద్యార్థికి వల
బీఏ తొలి ఏడాది చదువుతోన్న సాహిల్ నాజిర్ అనే విద్యార్థిని టెలిగ్రాం, ఇతర మొబైల్ యాప్ల ద్వారా వలలో వేసుకున్నారు జైషే ఉగ్రవాదులు. దాడులు చేసేందుకు ఓ పాత కారును కొనుగోలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో సాంకేతిక, ఇతర నిఘా వ్యవస్థల ఆధారంగా సాహిల్ను పట్టుకున్నట్లు చెప్పారు ఐజీ. కారు బాంబు దాడి పథకాన్ని పోలీసులకు అతడు వెల్లడించినట్లు తెలిపారు. ఈ కుట్రలో భాగమైన కైసర్, యూనిస్, యాసిర్ అహ్మద్ వానీని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 25న భద్రతా దళాలపై గ్రనేడ్ దాడి చేసినట్లు సాహిల్ ఒప్పకున్నాడని వివరించారు ఐజీ విజయ్.
లష్కరే ఉగ్రవాది అరెస్ట్..
లష్కరే తోయిబా కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తోన్న ఓ సభ్యుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు ఐజీ కుమార్. పాంపోర్లోని అతని ఇంటి నుంచి 25 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!