చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ భారాన్ని తగ్గించడానికి పలువురు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఆవిష్కరణలు కూడా చేస్తున్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న వీవీపీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఈ కోవకు చెందిన వారే. పెట్రోల్, విద్యుత్.. ఇలా రెండింటి మీదా నడిచే ఓ హైబ్రిడ్ బైక్ను తయారు చేశారు. మెకానికల్ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న పాండియ రుచిత్ భవద్వేష్, మాకడియా నిర్మల్ జయేష్, జాలా సతీష్ భరత్.. ప్రొఫెసర్ హర్దిక్పుర్ పర్యవేక్షణలో ఈ బైక్ను రూపొందించారు.
విద్యుత్ వాహనాలు వస్తున్నా..
అందుబాటులోకి ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నా.. వాటితో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అధిక ధర, తక్కువ రేంజ్, స్లో ఛార్జింగ్ సహా సరిపడా ఛార్జ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడం వంటివి.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగంపై సందేహాలను కలిగిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకే విద్యార్థులు ఈ సెమీ ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశారని ఆ కాలేజీ మెకానికల్ విభాగం హెడ్ డాక్టర్ నీరవ్ మణియర్ వెల్లడించారు.
ఈ బైక్ తయారు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టిందని, ఒక నెల పాటు దీనిని పరీక్షించామంటున్నారు విద్యార్థులు.
"ఈ బైక్ను పెట్రోల్, బ్యాటరీ సాయంతో నడిచేలా రూపొందించాం. వాహనదారుల సులువు కోసం రెండు వేర్వేరు లాక్లను అమర్చాం. ఒకటి పెట్రోల్ పెట్రోల్కు, మరొకటి బ్యాటరీకి. వినియోగదారుడి అవసరం మేరకు వారు ఏదైనా ఉపయోగించుకోవచ్చు."
-పాండియ రుచిత్ భవద్వేష్, విద్యార్థి
ఈ బైక్ మోటర్కు 4 బ్యాటరీలు అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 40 కిలోమీటర్ల వేగంగా వెళ్లగల ఈ బైక్ను ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. పెట్రోల్, విద్యుత్.. రెండింటికి వేర్వేరు యాక్సలేటర్లను ఏర్పాటు చేశారు.
పెట్రో భారాన్ని, ఎలక్ట్రిక్ బైక్స్లోని లోపాలను అధిగమించేందుకు రూపొందించిన ఈ హైబ్రిడ్ బైక్ వాహనదారులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి: ప్రపంచంలోనే హైస్పీడ్ రైలు- చైనా ఘనత