అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజస్థాన్లోని బన్సీ పహాడ్పుర్లోని గులాబీ రాయిని(పింక్ స్టోన్) రామ్లల్లా ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. గర్భగుడిలో మొత్తం 14 తలుపులు ఉంటాయి. ఆలయ నిర్మాణంలో నిమగ్నమైన సిబ్బంది, ఇంజినీర్లు రాంలల్లా ఆలయానికి తలుపులను ఏ కలపతో తయారు చేయాలనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. పొరుగున ఉన్న గోండా జిల్లాలోని బహ్రాయిచ్, షీషమ్-సఖు, మనకాపుర్ అడవుల నుండి దీనిని తెప్పించనున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో ముస్లిం కళాకారులు సైతం భాగమయ్యారు. తలుపులను అమర్చేందుకు.. వీరు తెల్లటి రంగు మక్రానా పాలరాయి ఫ్రేమ్లను తయారు చేస్తున్నారు.
![grand temple of Ramlala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-01-mandir-nirman-visbite-up10135_16072022172618_1607f_1657972578_400.jpg)
90వ దశకం నుంచి రామ మందిర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్లోని బన్సీ పహాడ్పుర్లోని గులాబీ రాళ్లను(పింక్ స్టోన్) చెక్కి ఉంచారు. 'ఆలయ నిర్మాణాన్ని 2024 జనవరి నాటికి పూర్తి చేస్తాం. ఆలయ వైభవాన్ని కాపాడేందుకు రామజన్మ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎల్లవేళలా కృషిచేస్తోంది. ఎటువంటి విపత్తులు వచ్చినా ఆలయం సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణానికి నాణ్యమైన సామాగ్రినే వాడుతున్నాం. ఆలయం నిర్మాణం కోసం ఇంజినీర్లు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నాం' అని హిందూ పరిషత్ ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు.
![grand temple of Ramlala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-01-mandir-nirman-visbite-up10135_16072022172618_1607f_1657972578_404.jpg)
2019లో సుప్రీం తీర్పు: 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేద మంత్రాల మధ్య ఆలయానికి పునాది రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి.
![grand temple of Ramlala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-ayo-01-mandir-nirman-visbite-up10135_16072022172618_1607f_1657972578_397.jpg)
ఇవీ చదవండి: Venkaiah Naidu: సాధారణ రైతు కుటుంబం నుంచి ఉపరాష్ట్రపతి వరకు..
'రాజకీయ వ్యతిరేకత శత్రుత్వంగా మారొద్దు.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు'