దేశంలో మధ్య తరగతి ప్రజలే లేకుండా చేసి.. తన కార్పొరేట్ మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్. ఇటీవల ప్యూ సంస్థ విడుదల చేసిన నివేదికలోనూ ఇదే స్పష్టమైందని 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
కొవిడ్-19ను కట్టడి చేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా దాదాపు 3.2 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి వెళ్లారన్న ప్యూ నివేదికను ఆసరాగా చేసుకుని కేంద్రంపై ఈమేరకు విమర్శలు గుప్పించారు మీమ్ అఫ్జల్.
"గతంతో పోలిస్తే దేశంలో మధ్యతరగతి ప్రజల శాతం గణనీయంగా తగ్గిపోయింది. దీన్ని బట్టి చూస్తే దేశంలోని మధ్యతరగతిని రూపుమాపేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. దేశాన్ని రెండు గ్రూపులుగా విడగొట్టాలని చూస్తోంది. మొత్తం ధనాన్ని కార్పొరేట్ మిత్రుల చేతిలో పెట్టి దేశాన్ని పేదరికంలోకి నెట్టివేయాలని చూస్తోంది."
-- మీమ్ అఫ్జల్, కాంగ్రెస్ నేత
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ఎన్నికల ప్రచారం నిర్వహించే రాజకీయ నేతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అఫ్జల్.
ఇదీ చదవండి : 'అసోం వరదలపై మోదీ మౌనమేల?'