గుజరాత్లోని సూరత్లో మరో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. వారంలో ఇది రెండో ఘటన. పల్సానా తాలూకాలో తాజా ప్రమాదం జరిగింది. రామ్ నగర్ పలియాలోని అంత్రోలి గ్రామంలో నివాసం ఉంటున్న.. సన్ముఖ్భాయ్ దల్పత్భాయ్ మోదీ అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి బైక్కు ఛార్జింగ్ పెట్టి.. కుటుంబ సభ్యులు నిద్రపోయారు. ఉదయం 4 గంటల సమయంలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

చూస్తుండగానే మంటలు ఇంటి మొత్తానికి వ్యాపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. ఇది గమనించిన ఇరుగు పొరుగు వాళ్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమాచారం అగ్నిమాపక శాఖకు తెలిసింది. హుటాహూటిన ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది, మంటలను ఆర్పి వేశారు. ప్రమాదంలో ఇల్లు చాలా వరకు దెబ్బతింది. రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.

కాగా, గత సోమవారం సూరత్లోనే ఓ ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయింది. ఓ కిరాణ దుకాణంలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ ప్రమాదంలో కిరాణ దుకాణంలో ఉండే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.
