Doctors test corona positive: బిహార్లో కొవిడ్-19 బారినపడుతున్న వైద్యుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నలంద వైద్య కళాశాల, ఆసుపత్రి(ఎన్ఎంసీహెచ్)లో తాజాగా మరో 72 మంది వైద్యులకు వైరస్ పాజిటివ్గా తేలినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ కుమార్ సింగ్ తెలిపారు. జనవరి 1, 2 తేదీల మధ్య 87 మంది వైద్యులు వైరస్బారిన పడగా.. తాజా కేసులతో ఆసుపత్రిలో నాలుగు రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య 159కి చేరిందన్నారు.
డిసెంబర్ 27, 28 తేదీల్లో పట్నాలో జరిగిన భారతీయ వైద్యుల సంఘం 96వ జాతీయ వార్షిక సదస్సులో పాల్గొన్న వైద్యులకు కరోనా నిర్ధరణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సదస్సుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఎన్ఎంసీహెచ్ వైద్యులు కరోనా బారినపడిన నేపథ్యంలో పట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ బాధితులతో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించే చర్యలు చేపట్టింది. కరోనా రెండో దశ సమయంలో.. వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు బిహార్లోనే అధికంగా ఉన్నారని ఐఎంఏ గతంలో తెలపటం గమనార్హం.
102 మంది వైద్య విద్యార్థులకు కరోనా
Medical students corona: పంజాబ్, పాటియాలాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 102 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులతో అత్యవసరంగా సమావేశమై పరిస్థితులను సమీక్షించారు ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ. సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు రాష్ట్ర మంత్రి డాక్టర్ రాజ్కుమార్ వెర్కా. కరోనా సోకిన విద్యార్థులను హాస్టల్ నుంచి మెడికల్ క్యాంప్కు తరలించినట్లు చెప్పారు.
" పాటియాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 102 కొవిడ్-19 కేసులు వచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్గా భావిస్తున్నాం. వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాం. అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని పాటియాలా పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది. "
- పాటియాలా డీసీ సందీప్ హాన్స్
ఇదీ చూడండి: వైద్యులపై కరోనా పడగ.. 193 మందికి పాజిటివ్