కరోనా వ్యాక్సిన్ల కొరతను రాష్ట్రాలు తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. 18 నుంచి 44 ఏళ్ల వయస్సు మధ్య వారికి టీకా ఇచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా 44ఏళ్ల లోపువారికి టీకా పంపిణీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. దిల్లీ కూడా కొవాగ్జిన్ నిర్వహణ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసింది. మరికొన్ని రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడి వారికి కూడా రెండో డోసు మాత్రమే ఇస్తున్నాయి.
గ్లోబల్ టెండర్లకు రాష్ట్రాల ప్రకటన
టీకాల కొరతను అధిగమించేందుకు ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు ప్రకటించగా.. తాజాగా రాజస్థాన్, తమిళనాడు ఈ జాబితాలో చేరాయి. రానున్న రెండు నెలల్లో రాష్ట్రానికి 20 లక్షల డోసుల స్పుత్నిక్ వ్యాక్సిన్ను దిగుమతి చేసుకోనున్నట్లు ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు.
రానున్న నాలుగు నెలలకు ప్రణాళిక
దేశీయంగా టీకాల సరఫరాను వేగవంతం చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్లు రానున్న నాలుగు నెలల కాలానికి తమ ఉత్పత్తి ప్రణాళికను కేంద్రానికి సమర్పించాయి. ఆగస్టు నాటికి సీరం సంస్థ (10 కోట్ల), భారత్ బయోటెక్(7.8 కోట్ల) డోసుల ఉత్పత్తి చేయవచ్చని తెలియజేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వివిధ రాష్ట్రాల్లో టీకా డ్రైవ్ మందకొడిగా సాగుతున్నప్పటికీ.. రెండో డోసు టీకాలపై దృష్టిసారించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సూచించారు.
ఇదీ చూడండి: 2027కు ముందే చైనాను అధిగమించనున్న భారత్!