మధ్యవర్తిత్వ తీర్పులను మార్పుచేసే అధికారం కోర్టుకు లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ, రాజీ చట్టం-1996 ప్రకారం, 'మధ్యవర్తి తీర్పును నిలుపుదల చేసే కోర్టు అధికార పరిధి'లో.. ఆ తీర్పును మార్పుచేసే అంశం లేదని పేర్కొంది. ఈ కారణంగా మధ్యవర్తిత్వ తీర్పును న్యాయస్థానాలు మార్పు చేయలేవని విస్పష్టం చేసింది.
ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్, జస్టిస్ బి.ఆర్. గవాయ్ల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టంలోని 34వ నిబంధనను పార్లమెంటు మార్చితేనే.. మధ్యవర్తిత్వ తీర్పులో మార్పులు చేసే అధికారం కోర్టులకు దఖలు పడగలదని వ్యాఖ్యానించింది. ఓ కేసులో- జాతీయ రహదారుల చట్టం కింద మధ్యవర్తిత్వ ట్రైబ్యూనల్ పరిహార మొత్తాన్ని నిర్ణయించింది.
అయితే.. బాధితులకు ఈ మొత్తాన్ని పెంచి ఇవ్వాలని మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయించింది. దీంతో మధ్యవర్తి తీర్పును కోర్టు ఎలా మార్పు చేస్తుందన్న ప్రశ్న తలెత్తింది. చివరికి ఈ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ఇదీ చదవండి: 'ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా?'