రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 4,371 పంచాయతీ సమితి సీట్లలో 1852 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. భాజపా ఏకంగా 1,989 సీట్లు కైవసం చేసుకుంది.
సీపీఎం 26, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) ఆరు, బహుజన్ సమాజ్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోగా.. స్వతంత్రులు 439 స్థానాల్లో విజయం సాధించారు.
జిల్లా పరిషత్ స్థాయిలోనూ హస్తం పార్టీ చతికిలపడింది. 635 స్థానాలకు కాంగ్రెస్ 252 చోట్ల గెలుపొందగా.. భాజపా అభ్యర్థులు 353 స్థానాల్లో విజయం సాధించారు. 13 జిల్లా బోర్డుల్లో భాజపా మెజారిటీ సాధించింది ఉంది. ఆర్ఎల్పీ మద్దతుతో మరో జిల్లా స్థానాన్ని గెలుచుకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ను ఐదు జిల్లాల్లోనే విజయం వరించింది.
'రైతుల మద్దతుకు నిదర్శనం'
రాజస్థాన్లో సాధించిన విజయం రైతుల నమ్మకానికి, కార్మికులు, పేదలు మోదీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి చిహ్నమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఓట్లేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కోట్లాది మంది గ్రామీణ ప్రజలు వ్యవసాయ సంస్కరణలకు మద్దతు తెలుపుతున్నారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు.
కేంద్రానికి వ్యతిరేకంగా రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. భాజపాకు ఈ ఫలితాలు జోష్ నింపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.