అసోం మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా కుమారుడు అశోక్ సైకియాను సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. 25 ఏళ్ల క్రితం నమోదైన రూ. 9 లక్షల రుణ ఎగవేత కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి.. అశోక్కు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడం వల్ల అతనిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
అశోక్ సైకియాను గువాహటిలోని సీబీఐ బృందం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పష్టం చేశారు. ఈ అరెస్ట్పై ఆయన సోదరుడు, ప్రస్తుతం అసోం శాసనసభలో ప్రతిపక్షనాయకుడుగా ఉన్న దేబాబ్రత సైకియా స్పందించారు. తన సోదరుడిని సీబీఐ అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని చెప్పారు.
"అశోక్ను అరెస్టు చేశారా లేక అదుపులోకి తీసుకున్నారా? అనే విషయం ఇంకా తెలియదు. ఎక్కడకి తీసుకెళ్లారు అనే సమాచారం కూడా మా దగ్గర లేదు. వారు చూపించింది చాలా పాత కేసు. దీనికి సంబంధించిన అన్నింటినీ పూర్తి చేశాం. బ్యాంక్ ఈ సమాచారాన్ని కోర్టుకు తెలియజేయక పోవడం వారి తప్పు."
-దేబాబ్రత సైకియా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
ఈ కేసు విషయంపై అశోక్ ఓ ప్రకటన విడుదల చేశారు. అసోం కోపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి 1996లో లోన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని 2011లో పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. ఇందుకుగానూ 2015లో బ్యాంక్ జనరల్ మేనేజర్ నో-డ్యూ లెటర్ను కూడా ఇచ్చనట్లు చెప్పారు. అయినా సీబీఐ అకస్మాత్తుగా వచ్చి రుణం గురించి చెప్పి అరెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇంతవరకు తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు.
ఇదీ చూడండి: దీదీతో అఖిలేశ్ జట్టు- టీఎంసీ వ్యూహాలతోనే యూపీ బరిలోకి..