ప్రస్తుత సమాజానికి అతిపెద్ద శత్రువైన కరోనాపై పోరు 'సర్జికల్ స్ట్రైక్'లా ఉండాలని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. వైరస్ విజృంభించే వరకు వేచి చూడకుండా.. ముందుగానే దానిని అంతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వ 'ఇంటికి సమీపంలో వ్యాక్సినేషన్' కార్యక్రమం.. వైరస్ దరి చేరేవరకు వేచి చూస్తున్నట్లు ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్, జస్టిస్ జీఎస్ కులకర్ణితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
"కరోనా వైరస్ అతిపెద్ద శత్రువు. దానిని నివారించాల్సిన అవసరం ఉంది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మీరు(ప్రభుత్వం) సర్జికల్ స్ట్రైక్లా వైరస్పై విరుచుకుపడాలి. మీ దగ్గరకు వచ్చేంత వరకు వేచి చూస్తున్నారు. శత్రువు ప్రదేశంలోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు."
- జస్టిస్ దిపాంకర్ దత్, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ప్రభుత్వ నూతన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ధ్రుతి కపాడియా, కునాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జాప్యం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ఇంటింటికీ వ్యాక్సిన్ పంపిణీ చేయడం కుదరదని.. ప్రతి ఇంటికి సమీపంలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కేరళ, జమ్ముకశ్మీర్, బిహార్, ఒడిశా సహా మహారాష్ట్రలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో ప్రతి ఇంటికీ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా.. కేంద్రం ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నించింది.
ఇదీ చూడండి: ఈసీగా బాధ్యతలు స్వీకరించిన అనూప్