Brother Killed Brother In Meerut : ఆస్తి కోసం సొంత అన్నయ్యనే హత్య చేశాడు ఉత్తర్ప్రదేశ్ మేరఠ్ జిల్లాకు చెందిన ఓ సోదరుడు. పైగా దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసి నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ దారుణానికి అతడి సోదరి, తల్లి కూడా సహకరించడం గమనార్హం. కాగా, హత్య చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు నిందితులు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి అంత్యక్రియలు అనంతరం నిందితులను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. మేరఠ్ జిల్లాలోని లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అషియానా కాలనీలో వెలుగు చూసిందీ ఘటన.
ఇంట్లో నుంచి గెంటేశాడని..
లోహియా నగర్కు చెందిన షెహ్జాద్(మృతుడు) బట్టల వ్యాపారి. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అషియానా కాలనీలో సోదరుడు అక్రమ్, తల్లి, సోదరితో కలిసి నివాసముంటున్నాడు. షెహ్జాద్ తమ్ముడు అక్రమ్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ కారణంతో అతడిని ఇంటి నుంచి గెంటేశాడు అన్న షెహ్జాద్. దీంతో అతడిపై కోపం పెంచుకున్నాడు తమ్ముడు అక్రమ్. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకం విషయంలో కూడా తరచూ గొడవలు జరిగేవి. ఇలా ఇద్దరి మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఇలా నిత్యం గొడవలకు కారణమవుతున్న అన్న షెహ్జాద్ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అలా శనివారం రాత్రి ఇంటికి వచ్చిన అన్నను మట్లాడాలని ఓ గదిలోకి తీసుకెళ్లాడు అక్రమ్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో వెంట తెచ్చుకున్న ఓ ఇనుప రాడ్డుతో షేహ్జాద్ ఛాతీపై బలంగా కొట్టాడు అక్రమ్. ఆపై కిందపడేసి గొంతు నులుముతూ వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో నిందితుడి సోదరి, తల్లి అక్కడే ఉన్నారు. వారి సాయంతో షెహ్జాద్ మృతదేహాన్ని ఫ్యాన్కు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అనుకున్న ప్రకారం చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు నిందితులు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో షెహ్జాద్ భార్య, పిల్లలు ఇంటి పైభాగంలో ఉన్న ఓ గదిలో నిద్రిస్తున్నారు.
పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ నిజం..
కుటుంబ సభ్యుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. షెహ్జాద్ తీవ్ర మనస్థాపానికి గురై ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడని నిందితులు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో శవాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు(నిందితులు) నిరాకరించారు. అయినప్పటికీ మృతదేహాన్ని జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచించి పోస్టమార్టం పరీక్ష చేయించారు పోలీసులు. సోమవారం వచ్చిన నివేదికలో షెహ్జాద్ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్యకు గురయ్యాడని వెల్లడైంది. దీంతో ముసలి కన్నీరు కారుస్తున్న అతడి సోదరుడు, తల్లి, సోదరిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలో నిజం ఒప్పుకున్నారు నిందితులు. ఆస్తి కోసమే తన అన్నను చంపినట్లుగా షెహ్జాద్ సోదరుడు పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో హత్యకు సహకరించిన మృతుడి తల్లి, సోదరి సహా ప్రధాన నిందితుడైన అక్రమ్పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.
"పోస్ట్మార్టం పరీక్ష నివేదిక ఆధారంగా ఈ ఘటనపై విచారణ జరిపాం. విచారణలో భాగంగా నిందితులు అది ఆత్మహత్య కాదని.. తామే హత్య చేసి బలవన్మరణంగా చిత్రీకరించామని ఒప్పుకున్నారు. షెహ్జాద్ శనివారం సాయంత్రం నమాజ్కు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లుగా అతడి భార్య చెప్పింది. షెహ్జాద్ను గొంతు నులిమి చంపినట్లుగా సోమవారం పోస్ట్మార్టం పరీక్ష నివేదికలో తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేశాము. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి తండ్రి మహ్మద్ ఇనామ్ కొన్నేళ్ల క్రితమే మరణించారు."
- అమిత్ రాయ్, పోలీసు అధికారి
Caste Census Congress : కుల గణన దేశానికి 'ఎక్స్-రే' లాంటిది: రాహుల్ గాంధీ
Fake Notes Found In SBI : SBIలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా RBIకే పంపిన బ్యాంకు అధికారులు