నిరసన చేస్తున్న రైతులను అయోమయానికి గురిచేసేందుకే కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శరద్ పవార్ లేఖలను భాజపా సర్కులేట్ చేస్తోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విమర్శించింది. రైతులకు మద్దతుగా ఎన్సీపీ ప్రకటన చేసిన తర్వాత వీటిని ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తింది. వ్యవసాయ శాఖ మంత్రిగా వాజ్పేయీ హయాంలో ప్రవేశపెట్టిన ఏపీఎంసీ చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్రాలను పవార్ ఒప్పించారని పేర్కొంది.
"పవార్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏకాభిప్రాయాలతోనే నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని అనుకోలేదు. కానీ మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. వ్యవసాయ చట్టాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతోంది."
-నవాబ్ మాలిక్, ఎన్సీపీ ప్రతినిధి
ప్రైవేటు రంగం ప్రధాన పాత్ర పోషించేలా ఏపీఎంసీ చట్టాన్ని సవరించాలని రాష్ట్రాలకు అప్పటి వ్యవసాయ మంత్రి శరద్ పవార్ రాసిన లేఖలోని వివరాలను భాజపా వర్గాలు బహిర్గతం చేశాయి. పవార్ తన లేఖలో సూచించిన విధంగానే తమ ప్రభుత్వం ఏపీఎంసీ చట్టానికి సవరణలు చేసిందని స్పష్టం చేశాయి. ఎన్సీపీ ప్రస్తుతం రైతులకు మద్దతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ వీటిని సర్కులేట్ చేశాయి.
అయితే కేంద్ర మంత్రిగా శరద్ పవార్ మార్పులు చేసిన ఏపీఎంసీ చట్టం వల్ల దేశంలోని రైతులు అనేక ప్రయోజనాలు పొందారని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తపాసే పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రైతులకు అభద్రతాభావాన్ని, అనేక అనుమానాలను మిగిల్చిందని అన్నారు.
ఇదీ చదవండి: రజనీ రాజకీయంపై సోదరుడి కీలక వ్యాఖ్యలు