Birbhum killings: బంగాల్ బీర్భుమ్ ఘటనను మరవకముందే బోగ్తుయ్ గ్రామంలో 40 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాలుగు బకెట్లలో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో నాటు బాంబులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు బీర్భుమ్ ఎస్పీ నాగేంద్ర నాథ్ త్రిపాటి తెలిపారు.
![40 crude bombs recovered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14844718_752_14844718_1648299791242.png)
అంతకుముందు.. బంగాల్లో బీర్భుమ్ సజీవ దహనాల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. మార్చి 26నుంచి విచారణ ప్రారంభించింది. బీర్భుమ్ హింసపై సీబీఐ విచారణ జరపాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7లోగా సీబీఐ నివేదిక సమర్పించాలని జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజతో కూడిన ధర్మాసనం తెలిపింది.
బీర్భుమ్ ఘటన తర్వాత బోగ్తుయ్ గ్రామంలోని ప్రజలు.. చుట్టుపక్కల గ్రామాలకు పారిపోతున్నారు. మళ్లీ ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న భయంతో ఉన్నారు గ్రామస్థులు.
ఇదీ జరిగింది
బంగాల్, రాంపుర్హట్ ప్రాంతంలో కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. "తృణమూల్ కాంగ్రెస్ నేత, బర్షాల్ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్ బహదూర్ షేక్ను ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్హట్లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు బాధితులను తీవ్రంగా కొట్టి అనంతరం సజీవ దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేయగా.. నిర్లక్ష్యం వ్యవహరించిన పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు.
ఇదీ చూడండి: సీబీఐ చేతికి బీర్భుమ్ కేసు.. విచారణ షురూ