లాక్డౌన్ కారణంగా.. వ్యవసాయ రంగంలో కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు పొలం పనుల్లో పలురకాలుగా ఉపయోగపడేలా.. ఫైబర్(నార) నిచ్చెనను తయారు చేశాడు కర్ణాటకవాసి దయానంద్.
కొబ్బరి, పోకచెక్క లాంటి పెద్ద పెద్ద చెట్లను సైతం అలవోకగా ఎక్కేవిధంగా ఈ నిచ్చెనను రూపొందించాడు ఆ యువకుడు. చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలను ఎక్కడానికీ ఇది సాయపడుతుంది. మంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ(మెస్కామ్) కార్మికులు ప్రయోగాత్మకంగా ఈ ఫైబర్ నిచ్చెనను ఉపయోగించారు. నారతో తయారైనందున కరెంట్ షాక్ నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుందని విద్యుత్ కార్మికులు అంటున్నారు.
20 కేజీల లోపే..
ఇలా బహుళ విధాలుగా ఉపయోగపడేందుకు తక్కువ బరువులోనే మూడు రకాల నిచ్చెనలను తయారుచేశాడు దయానంద్. 5, 10, 20 అడుగులలో విభిన్న రకాలుగా ఈ నిచ్చెనలు ఉంటాయి. ఒక్కోదాని బరువు కేవలం 20 కేజీలలోపు ఉండటం వల్ల.. సులభంగా ఒకచోటు నుంచి మరోచోటుకి వీటిని తీసుకెళ్లవచ్చు.
లాక్డౌన్ తెచ్చిన ఆలోచన..
శాస్త్ర సాంకేతికత వృద్ధి చెందుతోన్న నేటి తరంలో అల్యూమినియం నిచ్చెనలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఫైబర్ నిచ్చెన ఆలోచన వచ్చిందంటున్నాడు దయానంద్.
'లాక్డౌన్ కాలంలో ఫైబర్ నిచ్చెనను రూపొందించాలనే ఆలోచన వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనిని తయారు చేశాం. ఇప్పటికే ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. రైతులకు, విద్యుత్ కార్మికులకు బహుళ విధాలుగా ఉపయోగపడుతున్నందున ఈ నిచ్చెనకు డిమాండ్ పెరిగింది.'
- దయానంద్, నిచ్చెన రూపొందించిన వ్యక్తి.
ఇదీ చదవండి: ఆ ఉపాధ్యాయుల నుంచి 13 కోట్లు వసూలు!