దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర కీలకం. దేశాన్ని పాలించడంలో ఏ పార్టీకీ లేనంత అనుభవం కాంగ్రెస్ సొంతం. కానీ అంతటి చరిత్ర ఉన్న పార్టీ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరమైంది. నాయకత్వ లేమి, అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కరి అవుతోంది. ఇలా ఎంతకాలం? కాంగ్రెస్కు పునర్వైభవం తెచ్చేది ఎవరు? కాంగ్రెస్ను ముందుండి నడిపించేది ఎవరు? శక్తిమంతమైన నరేంద్ర మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఢీకొట్టి విజయం సాధించే సత్తా ఎవరికి ఉంది? అన్న ప్రశ్నలకు దాదాపు కాంగ్రెస్ సభ్యులందరూ చెబుతున్న ఏకైక సమాధానం.. 'రాహుల్ గాంధీ'.
రాహుల్ తిరిగి రావాలి...
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ 2019 జులై 3న పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు రాహుల్ గాంధీ. అనంతరం తాత్కాలికంగా ఆ పగ్గాలను సోనియా గాంధీకి అప్పగించారు కాంగ్రెస్ పెద్దలు.
రాహుల్ రాజీనామా చేసి ఏడాది గడిచినా.. పార్టీ నాయకత్వం విషయంలో ఇంకా అనిశ్చితి వీడలేదు. ఈ అంశం ఇంతకాలం అంతర్గతంగా ఉన్నప్పటికీ.. ఆగస్టు 10తో సోనియా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇదీ చూడండి:- 'మోదీ జీ.. బెదిరింపులకు అందరూ లొంగరు'
నిజానికి సోనియా పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఏడాది పొడవునా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అంశాన్ని పార్టీ సభ్యులు చర్చిస్తూనే ఉన్నారు. ఆనాడు రాహుల్ రాజీనామా చేయకూడదని అభ్యర్థించిన కాంగ్రెస్ సభ్యులు.. తిరిగి ఆయనే అధ్యక్ష పదవిని చేపట్టాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. కానీ రాహుల్ ఏమాత్రం సానుకూలంగా స్పందించడంలేదు.
ఆగని ప్రయత్నాలు...
అయినా కాంగ్రెస్ సభ్యులు తమ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. తాజాగా శనివారం జరిగిన కాంగ్రెస్ లోక్సభ ఎంపీల సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు స్వీకరించాలని ప్రతిపాదించారు సీనియర్ నేత కె.సురేశ్. ఆయనకు మరో ఆరుగురు ఎంపీలు మద్దతుపలికారు. కానీ రాహుల్ మాత్రం ఎప్పటిలాగే మౌనంగా ఉండిపోయినట్టు సమాచారం.
ఎన్నో దశాబ్దాల చరిత్ర గల కాంగ్రెస్ను తిరిగి గాడినపెట్టేందుకు రాహుల్ లాంటి ధైర్యవంతులు పార్టీ అధ్యక్ష పదవిలో ఉండటం ఎంతో ముఖ్యమని నేతలు అంటున్నారు.
"పార్టీ పునరుద్ధరణలో ఎదుర్కొనే సవాళ్లను కాంగ్రెస్ నాయకత్వం తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యవంతులు, చైతన్యవంతులైన రాహుల్-ప్రియాంక గాంధీ సేవలు పార్టీకి ఉపయోగపడతాయి. మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొనే సత్తా వీరికి ఉందని నేను నమ్ముతున్నా."
--- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత.
పార్టీని రాహుల్ గాంధీ ముందుండి నడిపిస్తే.. ఎంతటి త్యాగాలు చేయడానికైనా కాంగ్రెస్ సభ్యులు వెనకాడరని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
" సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ వారు ఎదుర్కోగలరని నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ వెంటే ఉంటుంది. మీరు డిమాండ్ చేస్తే ఎంతటి త్యాగానికైనా పార్టీ సభ్యులు వెనకాడరు. రాహుల్ జీ.. దయచేసి మమ్మల్ని ముందుండి నడిపించండి."
-- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఇదీ చూడండి:- యూపీలో 'అగ్రవర్ణ' రాజకీయం కాంగ్రెస్కు కలిసొచ్చేనా?
ఐకమత్యం లోపించి...
అయితే రాహుల్ గాంధీ రాజీనామాకు 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలతో పాటు మరో కారణం కూడా ఉంది. అదే.. కాంగ్రెస్ సభ్యుల్లో లోపించిన ఐకమత్యం. ఈ విషయాన్ని రాహుల్ అనేకమార్లు బహిరంగంగానే చెప్పారు. తన రాజీనామా లేఖలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుద్ధంలో తాను ఒంటరి పోరాటం చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాది గడిచినా.. పార్టీలో ఈ సమస్య ఇప్పటికీ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ సభ్యులపై విమర్శలు చేస్తూ దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ ట్వీట్ ఇందుకు నిదర్శనం.
"జాతీయ అంశాల్లో రాహుల్-ప్రియాంక చూపిస్తున్న దూకుడు వైఖరికి నేను మద్దతిస్తున్నా. కానీ కొందరు సభ్యులకు వీరి వైఖరి నచ్చడం లేదు. రాహుల్-ప్రియాంకకు వారు మద్దతివ్వడం లేదు. అసలు అలాంటి వాళ్లు కాంగ్రెస్లో ఉండటం ఎందుకు?"
--- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఇదీ చూడండి:- మిషన్ 2022: సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ!
మొర ఆలకించేనా?
సోనియ గాంధీ పదవీకాలన్ని మరికొంత కాలం పొడిగించే విషయంపై సీడబ్ల్యూసీ(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడి అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో.. అనేక అంశాల్లో కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ సభ్యుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు రాహుల్. కీలక అంశాలపై వివిధ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. మరి కాంగ్రెస్ సభ్యుల మొర ఆలకించి.. పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ తిరిగి చేపడతారా లేదా అన్నది ఆసక్తికరం.
ఇవీ చూడండి:-