ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ పొరపాటున బావిలో పడిపోయిన ఘటన కేరళ మలప్పురం జిల్లా తిరూర్లో శుక్రవారం రాత్రి జరిగింది. చివరికి ఆ ఫోను సాయంతో స్వల్పగాయాలతో బయటపడింది.
ఎడకులం గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆ అమ్మాయి తిరూర్లోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సమీపంలోని ఆలయంలో జరుగుతున్న పండుగ వేడుకలను చూడడానికి వెళ్లింది. అయితే అక్కడ జనం ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్ చేయడానికి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లింది. ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా బావిలో పడిపోయింది.
అదృష్టం బాగుండి ఆమె చేతిలోనే ఫోన్ ఉండడం కలిసొచ్చింది. తాను బావిలో ప్రమాదవశాత్తు పడిపోయానని బంధువులకు ఫోన్ చేసింది. అప్రమత్తమైన బంధువులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో ఆమెను వెలికితీశారు. ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: టెంపో-ట్రక్కు ఢీ.. 12 మంది దుర్మరణం