భారత సైన్యం మరింత బలోపేతం కానుంది. 24 బహుళార్థక ఎమ్హెచ్-60 'రోమియో' సీహాక్ హెలికాప్టర్లను భారత్కు అందజేయడానికి అమెరికా ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందం విలువ సుమారుగా 2.4 బిలియన్ డాలర్లు(రూ.16,320 కోట్లు) అని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఒప్పందానికి అనుమతిచ్చినట్లు ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ కాంగ్రెస్కు తెలిపింది.
ఈ సబ్మెరైన్ ప్రతిరోధక హంటర్ హెలికాఫ్టర్లను సమకూర్చుకోవాలని గత దశాబ్దకాలంగా ప్రయత్నిస్తోంది భారత్. జలాంతర్గాములు, నౌకలపై దాడికి, సముద్ర జలాల్లో గాలింపు, సహాయక చర్యలకు బ్రిటీష్ తయారీ సీ-కింగ్ హెలికాప్టర్లను వినియోగిస్తోంది భారత సైన్యం. తాజా ఒప్పందంతో వీటి స్థానాన్ని బహుళార్థక ఎమ్హెచ్-60 'రోమియో' సీహాక్ హెలికాప్టర్లు భర్తీ చేయనున్నాయి. ఫలితంగా దేశ రక్షణ వ్యవస్థ మరింత శక్తిమంతం కానుంది.
ఈ అధునాతన హెలికాప్టర్ల ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అమెరికా పేర్కొంది. ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత, శాంతి సహా ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.
సాటిలేని మేటి..
ప్రస్తుతం అమెరికా నావికాదళం ఉపయోగిస్తోన్న ఈ బహుళార్థక ఎమ్హెచ్-60 'రోమియో' సీహాక్ శ్రేణి, ప్రపంచంలోనే అత్యుత్తమ మారిటైమ్ హెలికాప్టర్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు.
ఈ 'రోమియో' సీహాక్ హెలికాప్టర్లను యాంటీ-సబ్మెరైన్, యాంటీ-సర్ఫేస్ వార్ఫేర్, నిఘా, సమాచార వ్యవస్థలు, రక్షణ, సహాయక చర్యలకు, నావికా యుద్ధాల్లో వినియోగించేందుకు అనువైనవి.
చైనా దుందుడుకు వ్యవహారశైలి, హిందూ మహా సముద్ర పరిధిలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్కు ఈ బహుళార్థక ఎమ్హెచ్-60 'రోమియో' సీహాక్ హెలికాప్టర్లు ఎంతో అవసరం.