కేంద్రం ప్రకటించిన పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) ముసాయిదా పర్యావరణానికి నష్టం కలిగించేలా ఉందన్న కాంగ్రెస్ విమర్శల్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో సమాధానమిచ్చారు.
కాలానుగుణంగా మార్పులు
"2006 నోటిఫికేషన్కు చేసిన సవరణలు, ఇచ్చిన ఉత్తర్వులను గతంలో ప్రజల ముందు పెట్టలేదు. మేం వాటన్నింటితోపాటు, తాజాగా వచ్చిన కోర్టు తీర్పులకూ నోటిఫికేషన్లో స్థానం కల్పించి ప్రజల ముందు పెట్టాం. ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకోవచ్చంటూ (పోస్ట్ ఫ్యాక్టో) నోటిఫికేషన్లో పొందుపరిచిన నిబంధన.. ఝార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తీసుకొచ్చాం.
పాత పరిశ్రమలకు అనుమతులిచ్చినా కొత్త తేదీల నుంచే అమలవుతాయి. అంతకుముందు కాలానికి పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్-15 ప్రకారం ఆలస్య రుసుముతోపాటు, అప్పటివరకు జరిగిన పర్యావరణ నష్టానికి భారీ జరిమానా విధించాలని నిర్ణయించాం. రూ.లక్ష జరిమానాతో పోస్ట్ ఫ్యాక్టో ఆమోద నిబంధనను యూపీయే ప్రభుత్వం తీసుకొస్తే మేం భారీ జరిమానా నిబంధనను అమలు చేస్తున్నాం.
ప్రజాభిప్రాయ సేకరణ సమయాన్ని 30 రోజుల నుంచి 20 రోజులకు కుదించాం. సాంకేతిక యుగంలో సమాచారం వేగంగా చేరిపోతోంది కాబట్టే అనవసర జాప్యాన్ని తగ్గించాం"
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి
ఇదీ చూడండి: వరదల నుంచి రక్షణ కల్పిస్తున్న 'ఈనాడు' ఇళ్లు