మహారాష్ట్ర అసెంబ్లీ నేటి నుంచి రెండు రోజుల పాటు సమావేశం కానుంది. 'మహా వికాస్ అఘాడీ' కూటమి నేతృత్వంలో ఏర్పడిన ఉద్ధవ్ సర్కార్.. ఇవాళ బల పరీక్ష ఎదుర్కోనుంది. అంతకుముందే నూతన మంత్రులను సభకు పరిచయం చేస్తారు.
రెండో రోజు శాసనసభ సభాపతిని ఎన్నుకుంటారు. తర్వాత.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేస్తారు. కొత్తగా నియమితులైన స్పీకర్... అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పేరును ప్రకటిస్తారు.
సులువుగానే...
మహా వికాస్ అఘాడీ కూటమి ఇంతకుముందే.. ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను గవర్నర్కు సమర్పించారు. అయితే.. డిసెంబర్ 3వ తేదీ నాటికి అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ.. ఠాక్రేను కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు ముంబయి గ్రాండ్ హయత్ హోటల్లో 162 మంది ఎమ్మెల్యేలతో 3 పార్టీలు బల ప్రదర్శన జరిపాయి. ఈ తరుణంలో.. విశ్వాస పరీక్షలో ఉద్ధవ్ ప్రభుత్వం సులువుగానే విజయం సాధించే అవకాశాలున్నాయి.
ప్రొటెం స్పీకర్గా దిలీప్ వాల్సే పాటిల్..
విశ్వాస పరీక్షకు ముందు మహారాష్ట్ర శాసనసభకు కొత్త ప్రొటెం స్పీకర్గా ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ఎన్నికయ్యారు. పాటిల్ గతంలోనూ సభాపతిగా పనిచేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే.. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార ప్రక్రియను ప్రొటెం స్పీకర్గా భాజపా ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్ నడిపించారు.
నవంబర్ 28న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మహారాష్ట్రలో నూతన సర్కార్ కొలువుతీరింది. ఈ కార్యక్రమాన్ని శివాజీ పార్కులో అట్టహాసంగా నిర్వహించారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన కూటమి 288కి గానూ.. 161 సీట్లు సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 సీట్లు ఉంటే చాలు. అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇరుపార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఎన్నికల అనంతరం.. కాంగ్రెస్-ఎన్సీపీతో శివసేన పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇదీ చూడండి: 'మహా' ముఖ్యమంత్రిగా తొలి నిర్ణయంలోనే ఉద్ధవ్ మార్క్