తమిళనాడుకు చెందిన వక్త నెల్లై కన్నన్... ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా రెండు మతాల మధ్య చిచ్చు రగిల్చే విధంగా ప్రసంగించినట్లు అభియోగాలు అందినందున కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో తమిళ నాడు వక్త నెల్లై కన్నన్ను అరెస్టు చేయాటానికి అతని ఇంటికి వెళ్లారు పోలీసులు. ఆ సమయంలో కన్నన్కు ఛాతీ నోప్పి రావటం వల్ల వెంటనే అతనిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
అసలు ఏం జరిగింది....
పౌరచట్టానికి వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) తిరునల్వేలిలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు నెల్లై కన్నన్. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు కన్నన్ చేశారు.
క్రిమినల్ కేసు...
అతని వ్యాఖ్యల వల్ల ప్రధానికి, కేంద్ర మంత్రి ప్రాణాలకు ముంపు పొంచి ఉందని అభిప్రాయ పడ్డారు తమిళనాడు రాష్ట్ర భాజపా ప్రతినిధి నారాయణ్ తిరుపతి. ఇటువంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకుగాను అతనిపై బెదిరింపు, హత్యా ప్రయత్నం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంపై...
కన్నన్ మాట్లాడిన దానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. ప్రధానిపైనే కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్సెల్వంపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అనేక ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఫిర్యాదులతో కన్నన్పై ఐపీసీ సెక్షన్ 504, 505,505(2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.