కోకో కోలా, థమ్స్ అప్ వంటి శీతలపానీయాలు ఆరోగ్యానికి హానికరమని.. వాటిపై నిషేధం విధించాలని పిల్ వేసిన ఓ సామాజిక కార్యకర్తకు మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. అతడి వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కోర్టు విలువైన సమయాన్ని అసంబద్ధ సమాచారం కలిగిన వ్యాజ్యాలతో వృథా చేశారని రూ.5 లక్షల జరిమానా విధించింది.
జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
"పిటిషనర్కు సాంకేతిక అంశాలపై ఎలాంటి అవగాహన లేకుండా వ్యాజ్యం దాఖలు చేశారు. ఎందుకు రెండు బ్రాండ్లపైనే పిల్ వేశారనే దానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది వ్యాజ్యాన్ని తప్పుదోవపట్టించడమే. చట్టంలోని ఆర్టికల్-32 ప్రకారం పిల్ నిబంధనలు పాటించలేదు. కోర్టు సమయాన్ని వృథా చేసిన కారణంగా రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నాం. ఆ డబ్బును నెలరోజుల్లోగా చెల్లించాలి" - సుప్రీం ధర్మాసనం