లాక్ డౌన్ నేపథ్యంలో రాజస్థాన్లోని కోటలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అసోంకు చెందిన 391 మంది విద్యార్థులు తమ ఊళ్లకు చేరుకున్నారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. స్వస్థలాలకు రావటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు విద్యార్థులు. రాజస్థాన్ ప్రభుత్వం తమకు అన్ని ఏర్పాట్లు చేసిందని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
![Kota](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/hp-una-kotascript-hpc10023_26042020113408_2604f_1587881048_161.jpg)
రాష్ట్రాల అంగీకారంతో..
విద్యార్థులను వారి స్వస్థలాకు అనుమతించేందుకు సంబంధిత రాష్ట్రాలు అంగీకరించిన నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వారిని పంపించేందుకు అనుమతి ఇచ్చారు. వారిని పంపే ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. అలాగే తమ ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
బిహార్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 వేల మంది విద్యార్థులు లాక్డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లోక్సభ స్పీకర్తో ఉపరాష్ట్రపతి చర్చ
రాజస్థాన్లోని కోటలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఎలా ఉన్నారని తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. స్థానిక ఎంపీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లాతో ఆయన ఆదివారం పలు దఫాలు ఫోన్లో మాట్లాడారు. తెలుగు విద్యార్థుల ఇబ్బందులపై 'ఈనాడు'లో వచ్చిన కథనాన్ని తర్జుమా చేయించి స్పీకర్కు పంపారు. లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంపై సభాపతితో చర్చించారు. వారి భోజన, వైద్య సంబంధిత ఏర్పాట్లు చేస్తామని, వ్యక్తిగత చొరవ చూపుతానని ఓం బిర్లా హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ తర్వాత పరిస్థితిపై కేంద్రం ప్లాన్స్ ఇవే..