అణ్వస్త్రాల వినియోగంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అణ్వాయుధాల విధానంలో భారత వైఖరి మారిందా అని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ. రాజ్నాథ్ ప్రకటన అస్పష్టంగా ఉందన్నారు.
" అణ్వస్త్ర విధానంలో ప్రభుత్వం వెనక కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని ప్రతిఒక్కరు ఉన్నారని అందరికి తెలుసు. ఇలాంటి అస్పష్ట ప్రకటనలతో రక్షణ మంత్రి మన ఊహకే వదిలేస్తున్నారా లేదా అణ్వస్త్రాల విధానంలో మార్పు చేయాలని కోరుకుంటున్నారా స్పష్టతనివ్వాలి. కొత్త విధానం ఏమిటో తెలిస్తే దేశం మొత్తం సంతోషంగా ఉంటుంది. అస్పష్టంగా, అసంపూర్తిగా కాకుండా పూర్తిగా తెలియజేయాలి."
- అభిషేక్ మను సింఘ్వీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఏవిధమైనా అణ్వాయుధాల విధానాన్ని తీసుకొచ్చిన దానిని స్వాగతిస్తామన్నారు సింఘ్వీ. కొత్త విధానానికి మద్దతుగా నిలుస్తామన్నారు. కానీ ఇలాంటి ముఖ్యమైన అంశాల్లో మాటలతో మాయచేయటం మానుకోవాలన్నారు.
అటల్ బిహారీ వాజ్పేయీ ప్రథమ వర్ధంతి సందర్భంగా.. రాజస్థాన్లోని పోఖ్రాన్ను సందర్శించారు రాజ్నాథ్. అటల్ జీకి నివాళులర్పించారు. అనంతరం అణ్వస్త్రాలు మొదట ప్రయోగించరాదన్నది ప్రస్తుతం దేశ విధానంగా ఉందన్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది అప్పటి పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వేడి రాజుకుంది.
ఇదీ చూడండి: 'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'