తమిళనాడులో ఘోరవిషాదం చోటుచేసుకుంది. కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో భారీ వర్షానికి ఓ ప్రహరీ గోడ పక్కనే ఉన్న ఇళ్లపై కూలింది. ఈ ఘటనలో వరుసగా ఉన్న నాలుగు ఇళ్లు పేకమేడలా కుప్పకూలాయి. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సహా ఇతర శాఖల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
వరద హెచ్చరికలు...
కుండపోత వర్షాలకు తమిళనాడులోని భవాని నది పొంగి పొర్లుతోంది. నదిపై కట్టిన రిజర్వాయర్లో నీటి నిల్వ పూర్తి సామర్థ్యానికి చేరింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు వరదల హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.