ఉగ్రముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో శ్రీనగర్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు. నగరం చుట్టూ నూతన బంకర్లను ఏర్పాటు చేశారు. సైన్యం క్యాంపులు, మిలిటరీ స్టేషన్లు సహా అన్ని చోట్లా భద్రతను పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రులు, పోలీస్స్టేషన్లు సహా..గతంలో ముష్కరులు రెండుసార్లు దాడి చేసేందుకు యత్నించిన శ్రీనగర్ విమానాశ్రయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా భద్రత పెంచారు. ముఖ్యమైన స్థలాల్లో పలు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హై అలర్ట్...
సైనిక క్యాంపులు, మిలిటరీ స్టేషన్ల వద్ద హై అలెర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ క్యాంపుల వద్దా రక్షణను పెంచినట్లు ఆయా సంస్థల అధికారులు వెల్లడించారు.
అవాంఛిత ఘటనలు జరగకుండా సరిహద్దు సమీపంలోని పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. చెక్పోస్టులను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి గస్తీని ముమ్మరం చేశారు.
ఆర్టికల్ రద్దు నుంచి..
ఆగస్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు ప్రకటనకు ముందు నుంచే పలు ప్రాంతాల్లో చెక్పోస్ట్లను ఏర్పాటు చేసిన అధికారులు షిఫ్టుల వారిగా పహారా కాస్తున్నారు. వీటిల్లోని సమస్యాత్మక బంకర్లలోనూ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
శ్రీనగర్ సహా కశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు యథేచ్చగా సంచరిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో చెక్పోస్ట్ల ఏర్పాటు వల్ల నగరంలో రాకపోకలపై నిఘా ఉండే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: ఐక్యరాజ్యసమితి వేదికగా 'హద్దు' మీరిన ఇమ్రాన్..!