దేశవ్యాప్తంగా బ్యాంకు సిబ్బందికి రక్షణ కల్పించాలని, వారిపై దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ.. రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది.
ఇటీవల సూరత్లో కెనరా బ్యాంకు ఉద్యోగినిపై ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశారు. మహారాష్ట్రలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బందిపై కొందరు అనుచితంగా ప్రవర్తించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో బ్యాంకు ఆవరణలో సిబ్బందిపై దాడి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు జిల్లా మెజిస్ట్రేట్లకు, రాష్ట్ర పోలీసులకు తగిన సూచనలివ్వాలంటూ ఆర్థిక మంత్రిత్వశాఖ తన లేఖలో తెలిపింది.
"సామాన్యులు, వ్యాపారులు, పరిశ్రమలు తమ పనులు కొనసాగించాలంటే బ్యాంకింగ్ సేవలు కీలకం. వాటికి అంతరాయం కలిగించే వ్యక్తులను ఉపేక్షించొద్దు. కఠిన చర్యలు తీసుకోండి. బ్యాంకు సిబ్బంది తమ విధులను ఆత్మవిశ్వాసంతో చేసుకునే వాతావరణం కల్పించండి"
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ
ఇదీ చూడండి: నేటి అవసరం.. డిజిటల్కు అనుసంధానం!