సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ను అయోధ్య భూవివాదం కేసు నుంచి ముస్లిం కక్షిదారులు తొలగించారు. ధావన్ అనారోగ్యంతో బాధపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు.
ఇకపై ఎలాంటి సంబంధం లేదు..
ముస్లిం కక్షిదారుల నిర్ణయాన్ని అంగీకరించినట్లు రాజీవ్ ధావన్ ఫేస్బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు.
"జమియాత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న(ఎడ్వకేట్ ఆన్ రికార్డ్) ఎజాజ్ మక్బూల్ నన్ను తొలగించారు. ఇందుకు అంగీకరించి నేను అధికారిక లేఖ పంపాను. ఇకపై అయోధ్య కేసు సమీక్షతో నాకు ఎలాంటి సంబంధంలేదు." - రాజీవ్ ధావన్, సీనియర్ న్యాయవాది
అందులో వాస్తవం లేదు..
అనారోగ్యం వల్లనే తనను తొలగించినట్లు ముస్లిం కక్షిదారులు పేర్కొనడం... పూర్తిగా అవాస్తవమని రాజీవ్ తెలిపారు. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే... ఇతర కేసుల విషయమై కోర్టుకు ఎలా హాజరవుతున్నానని ఆయన ఎదురు ప్రశ్నించారు.
విభజించాలనుకోవడం లేదు..
ముస్లిం పార్టీలను విభజించడం తనకు ఇష్టం లేదని రాజీవ్ ధావన్ పేర్కొన్నారు.
"అయోధ్య కేసు విషయంలో నేను ముస్లింపార్టీలన్నింటి తరపున వాదించాను. ఇప్పటికీ అదే కోరుకుంటున్నాను. ముస్లింపార్టీలు ముందుగా తమ విబేధాలను పరిష్కరించుకోవాలి."- రాజీవ్ ధావన్, సీనియర్ న్యాయవాది
పిటిషన్ వేసిన మరుసటి రోజే..
సుప్రీంకోర్టు 'అయోధ్య' తీర్పును సవాల్ చేస్తూ 'జమాత్ ఉలేమా ఇ హింద్' అధినేత మౌలానా అర్షద్ మదానీ సోమవారం సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు. మరుసటిరోజే న్యాయవాది రాజీవ్ ధావన్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: 'దిశ' కేసు దోషులకు శిక్షపై జయ అలా... హేమ ఇలా...