దివంగత ప్రధానమంత్రి రాజీవ్గాంధీ హత్య కేసు దోషి నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నం చేసింది. జీవిత ఖైదు పడిన నళిని.. ప్రస్తుతం తమిళనాడు వేలూరు తోరప్పాడి మహిళా కారాగారంలో 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తోంది.
"జైలులో ఇతర ఖైదీలతో నళినికి గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో జైలు అధికారుల వరకు చేరింది. దాంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. జైలు సిబ్బంది ఆమె ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.నళినికి ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆమె సురక్షితంగానే ఉంది."
- పుగళేంది, నళిని న్యాయవాది
29 సంవత్సరాలలో నళిని ఆత్యహత్యాయత్నం చేయటం ఇదే తొలిసారని, గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు న్యాయవాది.
1991, మేలో తమిళనాడులో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఆత్మాహుతి దాడి ద్వారా హత్య చేశారు. ఈ కేసులో నళిని భర్తతో పాటు మొత్తం ఏడుగురు దోషులుగా తేలారు. వారందరికి మరణశిక్ష పడగా.. ఆ తర్వాత దానిని జీవిత ఖైదుగా మార్చారు.