తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన బాంబు దాడిలో ఓ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారి మరణించారు. హత్య కేసు నిందితులను అరెస్టు చేసే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రాణాలు కోల్పోయిన పోలీసు పేరు సుబ్రహ్మణియన్గా పేర్కొన్నారు అధికారులు. జంట హత్యల కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో ఆయన సభ్యుడని తెలిపారు.
ఇదీ జరిగింది
హత్య కేసులో లభించిన ఆధారాలతో నిందితులు తలదాచుకున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిందితుడు దురై ముత్తుతో పాటు ఇతర అనుమానితులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే నిందితులకు పోలీసులకు మధ్య స్వల్పంగా మొదలైన ఘర్షణ.. క్రమంగా తీవ్రమైంది. దురై ముత్తు పోలీసులపై నాటు బాంబు విసిరాడు.
సుబ్రహ్మణియన్తో పాటు.. బాంబు విసిరిన దురై ముత్తు సైతం తీవ్ర గాయాలతో మరణించినట్లు అధికారులు తెలిపారు.
మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులతో ఘర్షణ పడ్డ ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి- 'ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల్లో కొత్త రూల్స్'