బాధితుల ఫిర్యాదులపై పోలీసులు సరిగా స్పందించటం లేదనేందుకు తాజాగా విడుదలైన జాతీయ నేర గణాంకాలు అద్దం పట్టాయి. జరుగుతున్న అన్యాయాల గురించి బాధితులు, మౌఖికంగా, లిఖితపూర్వకంగా మొర పెట్టుకుంటున్నా అందులో మూడొంతుల కేసుల్ని అసలు పట్టించుకోవటం లేదని తేలింది. కేవలం 26% కేసుల్లో మాత్రమే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. అందులోనూ ఛార్జిషీట్ దాఖలై, కోర్టుల ద్వారా శిక్షలు పడే కేసులు అతి స్వల్పంగా ఉంటున్నాయి.
- 2019లో దేశవ్యాప్తంగా పోలీసులకు 1.96 కోట్ల ఫిర్యాదులు అందితే, అందులో 51 లక్షల ఫిర్యాదుల పైనే ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. మిగతావన్నీ ఫిర్యాదు దశలోనే నీరుగారిపోయాయి. కోర్టుకు చేసిన ఫిర్యాదుల్లో మాత్రం 102% మేర ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. న్యాయవ్యవస్థ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండటం వల్ల వాటిపై స్పందిచక తప్పని పరిస్థితి నెలకొంది. మిగతా వ్యవస్థల్లో ఎంత పెద్దవారికి ఫిర్యాదులు చేసినా అత్యధికం బుట్టదాఖలే అవుతున్నాయి. పోలీసులు సుమోటోగా తీసుకున్న ఫిర్యాదుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఇలాంటి వాటిల్లో 86.24% ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి.
- దాదాపు 2 కోట్ల ఫిర్యాదుల్లో పావు వంతు కేసుల్లోనే ఎఫ్ఐఆర్లు నమోదుకాగా, చివరికి 1.02లక్షల కేసులే దర్యాప్తు, కోర్టు విచారణ దశ దాటి శిక్షల వరకు వెళ్తున్నాయి.
- హత్యా నేరాల్లో 41.3% మేర శిక్షలు పడగా, అత్యాచారాలు, అల్లర్లు/దాడులు, అపహరణ వంటి కేసుల్లో శిక్షల శాతం సగటున 25% లోపే ఉంది. ఇందులోనూ అత్యాచారం కేసుల్లో 22.4%, అపహరణ కేసుల్లో 23.3% మాత్రమే శిక్షలు పడ్డాయి.
- ఎక్సైజ్, మోటార్ వెహికిల్ చట్టాలు, నార్కోటిక్ డ్రగ్స్ లాంటి కేసుల్లో శిక్షలు అధికంగా ఉన్నాయి. ఇందులో అత్యధికం జరిమానాలు, స్వల్పకాల శిక్షలే కావటం వల్ల 91% వరకు శిక్షలు పడుతున్నాయి. ఐపీసీ కేసుల్లోని పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది.