కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేస్తోన్న భాజపా ఎంపీలు అందరితో ఈ వారం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశాల్లో భాజపా అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మినహా కేంద్రమంత్రులు ఎవరూ పాల్గొనబోరని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఎంపీలతో మోదీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ మహిళా ఎంపీలతో ఒకసారి, 45 ఏళ్ల లోపు ఎంపీలు అందరితో మరోసారి మోదీ భేటీ కానున్నారు.
పరిచయం కోసం...
ప్రధానికి భాజపా ఎంపీలను పరిచయం చేయడం కోసం ఆ పార్టీ వరుసగా 7 సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ అనధికారిక భేటీలన్నీ ప్రధానమంత్రి అధికారిక నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్లో నిర్వహిస్తారు.
ఈ సమావేశాల ద్వారా లోక్సభ, రాజ్యసభలోని భాజపా ఎంపీలు.. ప్రధానితో నేరుగా మాట్లాడడానికి, సమస్యలపై చర్చించడానికి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే పార్లమెంటుకు సంబంధించిన విషయాల్లో ప్రధాని మోదీ... ఎంపీలకు మార్గనిర్దేశం చేయడానికి వీలవుతుందని పార్టీ నేతలు తెలిపారు.
మోదీ ఇప్పటికే ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన భాజపా పార్లమెంట్ సభ్యులతో సమావేశమయ్యారు.
మోదీ 2.0... మొదటి సిరీస్
17వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో..... మొదటి దఫా సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. 16వ లోక్సభ కాలంలో, ప్రతి పార్లమెంట్ సెషన్లోనూ ఆయన వివిధ రాష్ట్రాల ఎంపీలతో సమావేశమై.. పార్టీ అజెండా గురించి చర్చించారు.
ఇదీ చూడండి: మసీదుల్లో మహిళల ప్రవేశంపై వ్యాజ్యం కొట్టివేత