కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గిన చమురు డిమాండ్ను భారత్ పెంచుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న కాలంలో భారత్లో ఇంధన వినియోగం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఇండియా ఎనర్జీ ఫోరం నాల్గో విడత సమావేశంలో అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు భారత్ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. 2022 నాటికి సౌర, పవన విద్యుత్ రంగంలో 175 గిగావాట్ల ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని భారత్ చేరుకుంటోందని పేర్కొన్నారు.
"భారత్ ఇంధన రంగ భవిష్యత్తు.. ప్రపంచానికి మార్పు. భారత్ పూర్తి స్థాయిలో ఇంధన సామర్థాన్ని కలిగి ఉందని నేను మీకు(పెట్టుబడిదారులకు) మాటిస్తున్నాను. భారత ఇంధన రంగానికి మంచి భవిష్యత్తు, భద్రత ఉంది. దీర్ఘకాలంలో భారత్ ఇంధన వినియోగం..రెండింతలు కానుంది. భారత్ వందశాతం విద్యుద్దీకరణ సాధించింది. ఈ నెల ప్రారంభంలోనే సహజ వాయువుల మార్కెటింగ్ సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రపంచానికి మేమిచ్చిన మాటకు..... నిబద్ధతతో కట్టుబడి, సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తాం. ప్రపంచ ఇంధన డిమాండ్ను భారత్ నడిపిస్తుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈ ఏడాది ఇంధన సంస్థలకు సవాలుతో కూడుకున్నదని మోదీ అన్నారు. ఇంధన డిమాండ్ మూడింట ఒకవంతు పడిపోయిందని చెప్పారు. అయితే.. ధరల విషయంలో చమురు, సహజవాయు ఉత్పత్తి సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.