సాధించాలనే తపన ఉంటే.. ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం అడ్డుకావని మరోసారి నిరూపించాడు కేరళకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి. బైక్ కొనుక్కునే స్థోమత లేదని చింతిస్తూ కూర్చోకుండా తానే స్వయంగా ఓ ద్విచక్రవాహనాన్ని తయారు చేసుకుని ఔరా అనిపిస్తున్నాడు.
కొట్టాయం జిల్లా, వైక్కోంకు చెందిన సుమిత్ సునీల్ అలియాస్ అంబలికి బాల్యం నుంచే బైకులు నడపాలనే కోరిక ఉండేది. కానీ, నాన్న ఆటో నడిపి తెచ్చే డబ్బు ఇల్లు గడవడానికే సరిపోవు, ఇక బండి కొనివ్వమని అడిగే పరిస్థితి లేదు. కుటుంబ ఆర్థిక స్థోమత తెలుసుకున్న అంబలి పదో తరగతి చదువుతున్నప్పుడే తన పాత సైకిల్కు బైకు భాగాలు బిగించి బైకు నడుపుతున్నట్లే భావించేవాడు.
అదే సైకిల్కు మరిన్ని బైకు భాగాలు బిగించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఆ భాగాలు కొనే స్థోమత లేదు. దీంతో పాత తుక్కు సామాన్ల దుకాణంలో ఓ ఇంజిన్ కొనుగోలు చేశాడు. సైకిల్ బండికి ఆ మోటరు అమర్చాడు. అలా దాదాపు నెల రోజులు శ్రమించి కేవలం రూ. 10 వేలు ఖర్చుతో బైకు రూపొందించాడు అంబలి.
ఈ సైకిల్ ఇంజిన్ బండిని విద్యుత్తో నడపడమే తన తదుపరి లక్ష్యం అంటున్నాడు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అంబలి.. భవిష్యత్తులో మెకానికల్ ఇంజినీర్ అవుతానంటున్నాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు.
ఇదీ చదవండి: బాపూదే గురుపీఠం- ఆయనో వికాస పాఠం!