రాష్ట్రాల అధికారాలను కేంద్రం కాలరాస్తోందని ఆరోపించారు 22 విపక్ష పార్టీల నేతలు. వెంటనే పార్లమెంట్ పనితీరు, పర్యవేక్షణను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు ఆయా పార్టీల నేతలు. దేశంలో ప్రస్తుత లాక్డౌన్, కరోనా మహమ్మారి పరిస్థితులపై చర్చించారు.
22 పార్టీలు దేశంలోని 70 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని.. వాటి డిమాండ్లకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్రం ముందు 11 పాయింట్ల డిమాండ్లను ఉంచారు.
- ఆదాయపన్ను పరిధిలో లేని కుటుంబాలకు నెలకు రూ. 7,500 నగదును ఆరు నెలల పాటు నేరుగా వారి ఖాతాల్లోకి వేయాలి. తక్షణమే ఉచిత రేషన్తో పాటు రూ. 10,000 ఇవ్వాలి. మిగతా నగదును ఐదు నెలల్లో ఇవ్వాలి.
- వ్యక్తిగతంగా ఆహారపదార్థాలు అవసరమైన వారికి వచ్చే ఆరు నెలల పాటు 10 కిలోల బియ్యం చొప్పున ఉచితంగా అందించాలి. ఉపాది హామీలో పనిదినాలను 200లకు పెంచి ఆదాయ మద్దతు కల్పించాలి.
- లాక్డౌన్ నేపథ్యంలో వలసకార్మికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులకు తక్షణం సాయం చేసేందుకు ఏర్పాట్లు చేయాలి.
- కరోనా మహమ్మారిపై కచ్చితమైన, సరైన సమాచారం అందించాలి. పరీక్షలు చేసే సౌకర్యాలు కల్పిస్తూ.. వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయాలి.
- కార్మిక చట్టాలు సహా ఏకపక్షంగా తీసుకున్న విధాన నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
- రబీ పంటలకు మద్దతు ధర చెల్లించి వెంటనే కొనుగోలు చేయాలి. రైతులకు సరైన మార్కెట్ సదుపాయాలు కల్పించాలి. ఖరీఫ్ సీజన్ కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వమే అందించాలి.
- కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలకు అవసరమైన నిధులను విడుదల చేయాలి.
- లాక్డౌన్ ఎత్తివేతకు అనుసరిస్తున్న వ్యూహంపై దేశ ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.
- పార్లమెంటరీ పనితీరు, పర్యవేక్షణను తక్షణమే పునరుద్ధరించాలి.
- ప్రచారాలకు పోకుండా పునరుజ్జీవనం, పేదరిక నిర్మూలనపై దృష్టిసారించి స్పష్టమైన, అర్థవంతమైన ఆర్థిక వ్యూహం ప్రకటించాలి. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచేలా నిజమైన ఆర్థిక ఉద్దీపనగా ఉండేలా సవరించిన, సమగ్ర ప్యాకేజీని అందించాలి.
- దేశీయ, అంతర్జాతీయ విమానాలకు అనుమతులు ఇచ్చే సమయంలో రాష్ట్రాలను సంప్రదించాలి.