దేశంలో లాక్డౌన్ విధించడం వల్ల కరోనా వైరస్ను చాలా వరకు నియంత్రించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. పలు అధ్యయనాల ప్రకారం దాదాపు 14-29 లక్షల కొవిడ్ కేసులు, 37-78 వేల మరణాలను నివారించగలిగినట్లు వెల్లడించింది. లాక్డౌన్ విధించకపోయి ఉంటే కేసులు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యేవని పేర్కొంది.
లాక్డౌన్ విధించడం సహా కొవిడ్ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ సంసిద్ధతపై పలు మీడియా సంస్థల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తాజా వివరణ ఇచ్చింది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి లాక్డౌన్ సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది.
సరైన సమయంలోనే
దేశంలో లాక్డౌన్పై సరైన సమయంలో, క్రియాశీలంగా నిర్ణయం తీసుకున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా సాధికారిక కమిటీ ఛైర్మన్ వీకే పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా దేశాలు లాక్డౌన్ పాటించక భారీ ప్రాణ నష్టాన్ని చవిచూశాయని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల కరోనా మరణాల రేటులోనూ గణనీయమైన తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి కొత్త కేసుల్లోనూ తగ్గుదల నమోదైనట్లు వెల్లడించారు.
లాక్డౌన్ ప్రారంభంలో కేసుల రెట్టింపునకు పట్టే సమయం 3.4 రోజులుగా ఉంటే ప్రస్తుతం అది 13.3 రోజులుగా ఉందని అన్నారు వీకే పాల్. కరోనా వైరస్ భారత్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసుల్లో 80 శాతం కేసులు 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
లాక్డౌన్ ఫలితాలు
లాక్డౌన్ వల్ల దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగినట్లు గణాంక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. దేశంలో లాక్డౌన్ ప్రభావంపై వివిధ అధ్యయనాలు, నిపుణులు వెలువరించిన నమూనా-ఆధారిత గణాంకాలను వివరించారు.
బోస్టన్ నివేదిక ప్రకారం లాక్డౌన్ విధించడం వల్ల 1.2 లక్షల నుంచి 2.1 లక్షల వరకు ప్రాణాలు కాపాడగలిగినట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. 36 నుంచి 76 లక్షల కొత్త కేసులను నివారించగలిగినట్లు తెలిపారు. భారత గణాంక సంస్థ అధ్యయనం ప్రకారం 20 లక్షల కరోనా కేసులు, 54 వేల మరణాలను ఆపగలిగినట్లు వెల్లడించారు.
స్వతంత్ర ఆర్థిక శాస్త్రవేత్తల నమూనా ప్రకారం 23 లక్షల కేసులు, 68 వేల మరణాలను లాక్డౌన్ అరికట్టగలిగిందని తెలిపారు శ్రీవాస్తవ. భారత ప్రజా వైద్య ఫౌండేషన్ ప్రకారం 78 వేల మంది ప్రాణాలను లాక్డౌన్ కాపాడగలిగిందని స్పష్టం చేశారు.
వీటి ప్రకారం లాక్డౌన్ కాలంలో దేశంలో మొత్తం 14-29 లక్షల కేసులు, 37 వేల నుంచి 78 వేల వరకు మరణాలను నియంత్రించినట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రజలు పూర్తిగా సహకరించినందు వల్లే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు.
తగ్గిన మరణాల రేటు
దేశంలో ఇప్పటివరకు 48,534 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మొత్తం బాధితుల్లో ఈ సంఖ్య 41 శాతమని వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో 3,234 మంది కోలుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యల వల్ల మరణాలు అదుపులోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు. మే 19న 3.13 శాతం ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 3.02 శాతానికి తగ్గిందని చెప్పారు.
రోజుకు లక్ష పరీక్షలు
శనివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు 27,55,714 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) వెల్లడించింది. రోజులో అత్యధికంగా 1,03,829 పరీక్షలు చేసినట్లు స్పష్టం చేసింది. గత నాలుగు రోజుల నుంచి రోజుకు లక్ష కరోనా పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది.