రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు మార్గాల్లో గంటకు 130/160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లలో.. స్లీపర్ కోచ్లు అన్నింటినీ ఏసీ కోచ్లుగా మార్చనుంది. అయితే.. ప్రయాణికులకు సరసమైన ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ప్రస్తుతం అనేక మార్గాల్లో ఎక్స్ప్రెస్ రైళ్లు గంటకు 110కి.మీ లేదా అంతకంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు మాత్రం 120 కి.మీ వేగంతో తిరుగుతున్నాయి. అయితే.. వీటి వేగ సామర్థ్యం మరింత పెంచేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని సంబంధిత ప్రతినిధి డీజే నారాయణ్ తెలిపారు. వాటికి అనుగుణంగా ఆయా రైళ్లకు సాంకేతికంగా ఏసీ కోచ్లు అమర్చడం అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.
రైల్వే నెట్వర్క్ను అప్గ్రేడ్(ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించడం, ఇతర సౌకర్యాలను పెంచడం) చేసే ఈ ప్రణాళికపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు నారాయణ్. ప్రస్తుతం 83 రైళ్లలో ఈ ప్రక్రియ చేపట్టారని.. ఈ ఏడాదిలోగా 100, వచ్చే సంవత్సరంలో 200 కోచ్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అయితే.. 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తోన్న రైళ్లలో నాన్-ఏసీ బోగీలు యథాతథంగా ఉంటాయని నారాయణ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో రూ.17లక్షలకు అమ్ముడైన జత ఎడ్లు!