చైనా డిజిటల్ గూఢచర్యంపై వస్తోన్న ఆరోపణలపై దర్యాప్తునకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ సైబర్ సెక్యురిటీ కోఆర్డినేటర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీని నియమించింది. దిల్లీలోని చైనా రాయబారి వద్ద విదేశాంగ శాఖ గూఢచర్యం అంశాన్ని లేవనెత్తినట్లు తెలుస్తోంది.
చైనాకు చెందిన సమాచార సాంకేతిక కంపెనీ జెన్హువా..సుమారు 10,000 మంది భారతీయులపై డిజిటల్ నిఘా పెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ జాబితాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ సహా అనేక మంది ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి చైనా ప్రభుత్వంతో ముఖ్యంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయని ఇవి పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: చైనా మరో కుట్ర- ప్రముఖులపై నిఘా!
30 రోజుల్లోగా..
ఈ విషయాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత పౌరుల వ్యక్తిగత సమాచారం, గోప్యతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 30 రోజుల్లోగా కమిటీ తన నివేదిక అందిస్తుందని వెల్లడించారు.
కాంగ్రెస్ డిమాండ్..
చైనా డిజిటల్ గూఢచర్యానికి సంబంధించిన కథనాలపై స్పందిస్తూ.. దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'చైనా నిఘా'పై కేంద్రానికి కాంగ్రెస్ ప్రశ్నలు