మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ప్రధాన ప్రతిపక్షం భాజపాపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవని స్పష్టం చేశారు. 'మహా వికాస్ అఘాడీ' అనే మూడు చక్రాల బండి... పగ్గాలు తన చేతిలో సురక్షితంగా ఉన్నాయని శివసేన అధికార పత్రిక సామ్నాలో పేర్కొన్నారు ఠాక్రే.
మహా వికాస్ అఘాడీ...
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లు కలిసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఈ కూటమి తన అనుభవంతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఆయన తన 60వ జన్మదినోత్సవం జరుపుకోనున్నారు.
ఇప్పుడు ముహూర్తం లేదా?
"నా ప్రభుత్వం భవిష్యత్తు ప్రతిపక్షం చేతిలో లేదు. మహా వికాస్ అఘాడీ అనే పేదల బండి... స్టీరింగ్ నా చేతిలో ఉంది. మిగతా రెండు పార్టీలు (కాంగ్రెస్, ఎన్సీపీ) వెనుక సీట్లో హాయిగా కూర్చున్నాయి. సెప్టెంబర్-అక్టోబర్ నాటికి మా ప్రభుత్వాన్ని పడగొడతామని భాజపా అంటోంది. అంతవరకు ఎందుకు? సత్తా ఉంటే ఇప్పుడే పడగొట్టొచ్చుగా."
- ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారా?
"మహా వికాస్ అఘాడీ ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా ఏర్పడిందని భాజపా విమర్శిస్తోంది. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను మీరు (భాజపా) కూల్చడం.. ప్రజాస్వామ్యమా?" అని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు.
అందుకు సానుకూలమే...
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు'ను స్వాగతిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని ముంబయి నుంచి నాగ్పుర్కు బుల్లెట్ ట్రైన్ తీసుకురావడం చాలా మంచి విషయమని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రాజస్థాన్: బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!