పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో ఓ ముస్లిం విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరైన వేళ సమావేశ మందిరం నుంచి తనను బయటకు పంపించివేశారని ఆమె ఆరోపించింది.
రబీహా అబ్దురెహీమ్.. ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్లో మొదటి ర్యాంక్ సాధించింది. పట్టా, బంగారు పతకం స్వీకరించేందుకు ఎంతో ఉత్సాహంగా స్నాతకోత్సవానికి వచ్చింది. అయితే పోలీసులు వచ్చి తనను ఒక గంటసేపు బయట ఉండాలని సూచించారని చెప్పింది రబీహా. రాష్ట్రపతి వెళ్లేవరకు లోపలకు అనుమతించలేదని ఆరోపించింది.
"నన్ను ఎందుకు బయటకు పంపారనే విషయం ఎవరికీ తెలియదు. నేను బురఖా విభిన్నంగా కట్టుకోవటం వల్లనే నన్ను బయటకు పంపారని అక్కడున్న పోలీసులు, విద్యార్థులు మాట్లాడుకున్నారు. కానీ, ఎవరూ వచ్చి ఎందుకు పంపామనే విషయం నాకు చెప్పలేదు.
రాష్ట్రపతి వెళ్లిపోయాక నన్ను లోపలికి వచ్చి పట్టా, గోల్డ్ మెడల్ తీసుకోమన్నారు. నేను నిరాకరించాను. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చర్యలు చాలా బాధాకరం. అందుకే నేను వద్దనుకున్నాను."
-రబీహా అబ్దురెహీమ్, విద్యార్థి
ఇదీ చదవండి: ప్రస్థానం: నాడు ఎమ్మెల్యేగా ఓటమి.. నేడు రెండోసారి సీఎం!